కలం, వెబ్డెస్క్: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (PBKS)ను ముంబై ఇండియన్స్ (MI) చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ మెరిస్తే, బ్యాటింగ్లో తిలక్ వర్మ పోరాడి జట్టును గెలిపించాడు. పంజాబ్ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఓపెనర్ రికల్టన్ స్ట్రాంగ్ బేస్ నిర్మించగా, దానిని తిలక్ వర్మ కంటిన్యూ చేస్తూ అదరగొట్టాడు. పంజాబ్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 32 బంతుల్లోనే 57 పరుగులతో (6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లోనే 38 పరుగులతో మెరుపులు మెరిపించాడు. విష్ణు వినోద్ (15 నాటౌట్), జేవియర్ బార్ట్లెట్ (18 నాటౌట్) మెరుపులతో పంజాబ్ భారీ స్కోరు అందుకుంది. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయకపోయినా పంజాబ్ను కట్టడి చేశాడు.
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్ ర్యాన్ రికల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి గెలుపుకు బలమైన పునాది వేశాడు. రోహిత్ శర్మ 25 పరుగులకే వెనుదిరిగినప్పటికీ, నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ 33 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మకు తోడుగా విల్ జాక్స్ కేవలం 10 బంతుల్లో 25 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. 19.5 ఓవర్లలోనే ముంబై 205 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మార్కో జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు, ఇది పంజాబ్ ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

