కలం, వెబ్డెస్క్: టూ టైమ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు భారీ షాక్ తగిలింది. పటియాలాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో నిఖత్ జరీన్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో ఈ రెండు మెగా ఈవెంట్లలో ఆమెకు చోటు దక్కే అవకాశాలు దాదాపు ముగిసినట్టయ్యాయి. పారదర్శకత కోసం తిరిగి ప్రవేశపెట్టిన ట్రయల్స్ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే ఈ షాకింగ్ ఫలితం రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
51 కేజీల సెమీఫైనల్లో నిఖత్ జరీన్, సాక్షి చౌదరితో తలపడగా.. హోరాహోరీగా సాగిన పోరులో 1-4 తేడాతో ఓడిపోయారు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన నిఖత్కు ఇది భారీ ఎదురుదెబ్బగా మారింది. ఇదే ట్రయల్స్లో 48 కేజీల విభాగంలో మీనాక్షి.. నీతూ గంగాస్ను ఓడించి ఫైనల్కు చేరగా, 70 కేజీల్లో హితేష్ గులియాపై సుమిత్ విజయం సాధించారు. మహిళల 80 కేజీల విభాగంలో పూజా రాణిపై నైనా గెలిచారు.
గతంలో అమలులో ఉన్న అంచనా ఆధారిత ఎంపిక విధానంపై విమర్శలు రావడంతో, బాక్సింగ్ ఫెడరేషన్ మళ్లీ ట్రయల్స్ పద్ధతిని తీసుకొచ్చింది. రింగ్లో గెలిచిన వారికే అవకాశం దక్కుతుండటంతో ఎక్కువ మంది బాక్సర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ట్రయల్స్ విజేతలు కామన్వెల్త్ గేమ్స్కు ముందు శిక్షణ కోసం చెకియా వెళ్లనుండగా, రన్నరప్లు చైనాలో జరిగే వరల్డ్ బాక్సింగ్ కప్లో పాల్గొంటారు.

