తిలక్ వర్మ ఒంటరి పోరాటం.. ఆర్‌సీబీ ముందు 167 పరుగుల టార్గెట్

కలం, వెబ్ డెస్క్: మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాలంటే 167 పరుగులు చేయాలి.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (2) విఫలం కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ (0)గా వెనుతిరగడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. రోహిత్ శర్మ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో మెరుపులు మెరిపించినా 22 పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) జంట ముంబైని ఆదుకుంది. తిలక్ ఆచితూచి ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు నడిపించగా, నమన్ ధీర్ అతడికి మంచి సహకారం అందించాడు.

ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పాత రోజులను గుర్తుచేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలకమైన 4 వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటర్ల నడ్డి విరిచాడు. కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి తన కోటా పూర్తి చేసిన భువీ, డెత్ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసి అతడికి తోడయ్యారు. మధ్య ఓవర్లలో కోలుకున్నట్లు కనిపించిన ముంబై, చివరి ఓవర్లలో మళ్ళీ వికెట్లు పారేసుకుంది. విల్ జాక్స్ (10), రాజ్ బావా (16) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. చివర్లో కోర్బిన్ బాష్ (5 నాటౌట్), దీపక్ చాహర్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో, ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ముంబై బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది. మరి 167 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్‌సీబీ ఏమాత్రం అదరగొడుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>