కలం, స్పోర్ట్స్: వరుస టీ20 సిరీస్ ఓటముల తర్వాత టీమిండియా ఉప కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్లో మళ్లీ విజయాల బాట పట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 2026 జూలైలో జరిగిన బ్రిటిష్ దీవుల పర్యటన టీమిండియాకు నిరాశ కలిగించింది. మొత్తం 10 మ్యాచ్ల్లో ఒక్క విజయమే సాధించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో వరుసగా రెండు టీ20 సిరీస్లను కోల్పోయింది.
టీ20 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. జింబాబ్వే సిరీస్కు ముందు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తిలక్ వర్మ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియా పరిస్థితుల్లోనే ఆడామని గుర్తు చేశారు. ఒక్కసారిగా విదేశీ పరిస్థితుల్లో బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడటం పెద్ద సవాల్గా మారిందని చెప్పారు. ఆ పరిస్థితులకు అలవాటు పడటం అంత సులభం కాదని వివరించారు. జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై కూడా తిలక్ ప్రశంసలు కురిపించారు.
ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఉండటం, డ్రెస్సింగ్రూమ్లో సానుకూల వాతావరణం కొనసాగించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కానీ జట్టులో ప్రతి ఆటగాడికి మద్దతుగా నిలవడం అవసరమని పేర్కొన్నారు. గత సిరీస్ మంచి అనుభవాన్ని ఇచ్చిందని, అక్కడ నేర్చుకున్న విషయాలను జింబాబ్వే సిరీస్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ విజయాల ఊపును అందుకోవడమే జట్టు లక్ష్యమని చెప్పారు.

