కలం, వెబ్ డెస్క్ : జనగామ, తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. జనగామ మున్సిపల్ (Jangaon Municipality) చైర్ పర్సన్గా బాలమణి, తొర్రూరు మున్సిపల్ (Thorrur Municipality) చైర్మన్ గా తూనం శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. కాగా ఈ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. జనగామ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ పద్ధతిలో మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నదని ఆరోపించారు.
జనగామలో 30 వార్డులకు గానూ బీఆర్ఎస్ 13 చోట్ల విజయం సాధించింది. ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. ఎక్స్ అఫిషియో మెంబర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల బలం 16 అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు దక్కాయి. సీపీఎం సభ్యుడు మద్దతు ఇచ్చారు. మరో ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి నమోదుకావడంతో కాంగ్రెస్ బలం 16కు చేరింది. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు.
తొర్రూరులో మొత్తం 16 వార్డులకు గానూ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిసియో సభ్యులుగా నమోదు కావడంతో కాంగ్రెస్ బలం 9కి చేరుకున్నది. దీంతో ఈ మున్సిపాలిటీలో లక్కీ డ్రా నిర్వహించగా కాంగ్రెస్ సభ్యుడు మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.


