కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట(Siddipet) జిల్లా వర్గల్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాచారం హల్దీ వాగు (Haldi Vagu) లో గల్లంతై ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న సాయంత్రం తూప్రాన్లో జరిగిన ఓ పెళ్లికి హాజరయిన ముగ్గురు యువకులు.. అనంతరం నాచారం వద్ద హల్దీ వాగులో స్నానం చేయడానికి దిగినట్లు తెలుస్తోంది. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం ముగ్గురి మృతదేహాలను వాగు నుంచి వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఎర్రగుళ్ల ప్రశాంత్ (27), వికాస్(27), కొంతమి ఆనంద్ రెడ్డి(27) గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

