కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లిలో ఓ ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు గ్యాస్ సిలిండర్ (Gas Cylinder)కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్ నుంచి నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ కుటుంబం లంకపల్లిలో సెటిల్ అయింది. లంకపల్లిలోని మసీద్లో నివాసం ఉంటూ మౌల్వీ సాబ్గా పని చేస్తున్న మహమ్మద్ కమాలుద్దీన్, దగ్గరలోనే ఓ ఫాన్సీ షాపు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటికి తాళం వేసి దంపతులు ఇద్దరు షాపుకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు పగల గొట్టి చోరీకి పాల్పడ్డారని మహమ్మద్ కమాలుద్దీన్ తెలిపారు.
దొంగలు బీరువా తాళాలు పగల గొట్టి 5.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 15 లీటర్ల వంట నూనె డబ్బా, గ్యాస్ సిలిండర్ణు కూడా దొంగిలించారని వాపోయారు. గ్యాస్ పొయ్యిని తీసుకెళ్లకుండా కనెక్షన్ తీసివేసి మరీ సిలిండర్ణు తీసుకెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

