కలం, వెబ్ డెస్క్: శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్లో ఐటీని మరింత విస్తరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర ఐటీ ఐకానిక్ సైబర్ టవర్స్ తరహాలో మరో కొత్త ఆధునిక పరిపాలన భవనాన్ని (New Cyber Tower) నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ నిర్మాణాన్ని సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) కోసం చేపట్టనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కైత్లాపూర్లో 5 ఎకరాల భూమిని ఎంపి చేసి సుమారు రూ.200 కోట్ల వ్యయంతో టవర్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇంజినీర్లు డిజైన్లపై పని చేస్తున్నారు. తుది రూపకల్పన పూర్తయ్యాక ప్రభుత్వ ఆమోదంతో పనులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా నిర్మించనున్న సైబర్ టవర్ ను జీ+8 అంతస్తులతో ఆధునిక నిర్మాణం చేపట్టనున్నారు.
నిర్మాణ రూపకల్పనలో ఐటీ కారిడార్కు తగిన ఆధునిక శైలి ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భవనం రూపం, సదుపాయాలు, అంతర్గత విభాగాల ప్లానింగ్ అన్ని కలిపి ఇది ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా నిలిచేలా యోచిస్తున్నారు. ప్రజలకు సులభంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో మున్సిపల్ శాఖతో పాటు జలమండలి, రెవెన్యూ, విద్యుత్ శాఖల కార్యాలయాలను ఒకే భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అదనంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రజలు వేర్వేరు కార్యాలయాలకు తిరగాల్సిన పని ఉండదు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక ప్రాంతాలను చేర్చారు. మొత్తం 3 జోన్లు, 16 సర్కిళ్లతో ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద పరిధికి సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యాలయం అవసరం ఉండటంతో ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.

