కలం, వెబ్ డెస్క్: పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల సందర్భంగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే బస్ పాస్ను చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం పరీక్షలు జరిగే అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది.
విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షల సమయంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అదనపు బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బస్సు స్టాప్ లేకపోయినా పరీక్షా కేంద్రాల వద్ద బస్సులను ఆపాలని డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. అమ్మాయిలు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీగా ప్రయాణిస్తుండగా, అబ్బాయిలకూ ఆర్టీసీ ఈ అవకాశం కల్పించింది.

