కలం, వెబ్డెస్క్: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా ఏపీలో విద్యార్థి, యువజన సంఘాలు నేడు చలో లోక్భవన్ (Lok Bhavan) కు పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడ (Vijayawada) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి లోక్ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందస్తుగానే లోక్భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మోహరించారు. విద్యార్థులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
కొందరు పోలీసులను తప్పించుకొని లోక్ భవన్ వైపు దూసుకురావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు గవర్నర్తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసులు నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులు తోసేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో తమ నిరసనలను అణిచివేసినా, విద్యార్థుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

