కలం, నేషనల్ డెస్క్: తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు భాగ్య (Maoist Bhagya) అలియాస్ రూపీ చత్తీస్గఢ్లో (Chhattisgarh) సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. కాంకేర్ జిల్లాలో కూంబింగ్కు వెళ్ళిన భద్రతా దళాలకు మావోయిస్టు దళం తారసపడిందని, ఆ సమయంలో లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని ఆ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని, అందులో భాగంగా ఛోటే బెతియా, పర్తాపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని మచ్పల్లి అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్ చర్యలు చేపట్టిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
ఘటనా స్థలంలో ఆమె మృతదేహంతో పాటు ఒక పిస్టల్, కొంత పేలుడు పదార్ధాలు, ఇతర సామాగ్రి లభించినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా చత్తీస్గఢ్ను ప్రకటించిన రెండు వారాల తర్వాత ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య (Maoist Bhagya) అజ్ఞాతంలో ఉన్నారంటూ నాలుగు రోజుల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

