కలం, వెబ్ డెస్క్ : వానాకాలం సీజన్ కోసం నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి దశ రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి దశలో 2 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదలయ్యాయి. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వం రెండోదశ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
10.68 లక్షల రైతుల ఖాతాల్లో రెండోదశ రైతు భరోసా డబ్బులు మొత్తం రూ.1590.02 కోట్లు జమ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు మొదటి, రెండోదశకు సంబంధించి మొత్తం 54.96 లక్షల మందికి రైతు భరోసా చెల్లింపులు జరిగినట్లు వివరించారు. మొత్తం రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.4072.04 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.
యూరియా యాప్తో వెలుగులోకి అక్రమాలు..
మరోవైపు సిద్దిపేట యూరియా బస్తాల అక్రమాలు యూరియా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. 6000 యూరియా బస్తాలు మాయమైన కేసులో డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారిని కూడా సస్పెండ్ చేశామన్న మంత్రి.. యూరియా యాప్ వల్లే అక్రమాలను గుర్తించడం సాధ్యమైందని వివరించారు. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదని.. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

