కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (Telangana Private Teachers Forum) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బందిపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రూపారెడ్డి హత్యపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

