కలం, హనుమకొండ: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖను (Konda Surekha) ఉద్దేశించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పార్టీలో గుంటనక్కలు సురేఖకు అండగా ఉన్నాయి.. మా రక్తం తాగింది చాలు.. ఇక తప్పుకో” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలోని కొందరు వ్యక్తులు సురేఖకు మద్దతుగా నిలుస్తూ విభేదాలను మరింత పెంచుతున్నారని నాయిని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు తనలాంటి పార్టీ నాయకులను అవమానించేలా వ్యవహరించడాన్ని ఇకపై సహించబోమని హెచ్చరించారు.
పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి వచ్చేలోపే సురేఖ స్వచ్ఛందంగా తప్పుకోవడం మంచిదని నాయిని సూచించారు. తమను అవమానిస్తూ, రాజకీయ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఇకపై చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే నాయిని రాజేందర్రెడ్డి, కొండా సురేఖ మధ్య విభేదాలు పలుమార్లు బహిరంగంగా బయటపడిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. నాయిని వ్యాఖ్యలపై సురేఖ వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

