కలం, నిర్మల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా (BJP Protest) చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భూముల వ్యవహారంలో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని విమర్శించారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చడం వెనుక అక్రమాలు, అవినీతి చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ శాఖలో ఇంతటి అవినీతి ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

