కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్త విద్యుత్ ఆర్టిజన్స్ తమ సమ్మె విరమించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) ఆర్టిజన్ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. సమ్మెను విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆర్టిజన్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) స్పష్టమైన హామీ ఇచ్చారని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ చర్చల నేపథ్యంలో వెంటనే విధుల్లోకి చేరుతున్నామని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు విద్యుత్ సంస్థల యాజమాన్యానికి విజ్ఞప్తులు చేసిన ఆర్టిజన్లు ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. పలు దఫాలుగా నిరసనలు తెలిపినా పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె తప్పలేదు. సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే ఆటోమేటిక్గా టెర్మినేట్ అయినట్లేనంటూ తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో, ఉత్తర-దక్షిణ డిస్కం లాంటి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేసి హెచ్చరించాయి. అయినా సమ్మెను విరమించకపోవడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ప్రతినిధులతో విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగి సమ్మె ముగించేలా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి.

