కలం, మహబూబ్నగర్ బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి (Peri Venkat Reddy) తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లోని పీఆర్టీయూ భవనంలో విశ్రాంత మహిళా ఉద్యోగుల ఫోరం (ఉజ్వల) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చలు జరిగాయని, వారి ప్రయోజనాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 12న హెల్త్ కార్డుల కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒక్కరు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.
ఇప్పటికే ప్రభుత్వ వాటాను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ట్రస్ట్ ఖాతాలో జమ చేశారని, ఉద్యోగుల వాటాను మే నెల నుంచి మినహాయించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటోందని, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని సుమారు రెండున్నర లక్షల మంది పెన్షనర్లు కూడా హెల్త్ కార్డుల ద్వారా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొని పేరి వెంకటరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.

