కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి ( Telangana Jagruthi)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల వారు ఆమె పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. మరోవైపు టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్ సైతం తెలంగాణ జాగృతిలో చేరిపోయారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మరోవైపు ఇప్పటికే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తెలంగాణ జాగృతిలో చేరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బాలయ్య సైతం పార్టీలో చేరిపోయారు. పార్టీ ప్రకటన ముందు మరింత మంది నాయకులు కవిత పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పార్టీ ఏర్పాటు కార్యక్రమం వరకు తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

