కలం, వెబ్ డెస్క్: ‘అభిషేక్ శర్మ (Abhishek Sharma) వేస్ట్. పెద్ద ఆటగాడు కాదు. తొలి బంతి నుంచే ఊపేయాలని చూస్తాడు ఔట్ అవుతాడు. ఫాట్ సెలక్షన్ గురించి అతని నాలెడ్జ్ శూన్యం. వరల్డ్ కప్లో కూడా అదే పరిస్థితి. అతడిని కొనుక్కుని ఎస్ఆర్హెచ్ తప్పు చేసింది’ ఇలాంటి విమర్శలన్నింటికీ అభిషేక్ వర్మ (Abhishek Sharma) తన బ్యాట్తో బదులిచ్చాడు. హైదరాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ విమర్శలన్నింటినీ తన బ్యాట్తో పటాపంచలు చేశాడు అభిషేక్. 68 బంతుల్లో 135 పరుగులు చేసి రికార్డులను వేటాడాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక ఇండివిడ్యువల్ స్కోర్ చేసిన టాప్ ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో రెండో సారి తన పేరు రాశాడు.
ఈ భారీ సెంచరీతో అభిషేక్ ప్రస్తుత సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ శర్మ పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. టీ20 క్రికెట్లో ఇది ఆయనకు 9వ సెంచరీ. దీనితో భారత్ తరపున అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును ఆయన సమం చేశారు. అలాగే, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తరపున డేవిడ్ వార్నర్, హెన్రిచ్ క్లాసెన్ తర్వాత రెండు సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్లోనే 59 పరుగుల మార్కును దాటడం ద్వారా సన్రైజర్స్ తరపున 2,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారతీయ ఆటగాడిగా శిఖర్ ధావన్ సరసన చేరారు.
అభిషేక్ జోరు కేవలం రికార్డులకే పరిమితం కాలేదు. 2026 సీజన్లో 300 పరుగుల మైలురాళ్లను దాటిన మొదటి బ్యాటర్గా ఆయన నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాను పరిశీలిస్తే, అభిషేక్ సాధించిన ఈ 135 పరుగులు 5వ స్థానంలో ఉన్నాయి. 2013లో క్రిస్ గేల్ చేసిన 175 పరుగులు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉండగా, మెకల్లమ్ (158), 2025లో పంజాబ్పై అభిషేక్ చేసిన 141 పరుగులు, క్వింటన్ డికాక్ (140) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గతంలో 2025లో పంజాబ్పై అభిషేక్ చేసిన 141 పరుగులే ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయుడు సాధించిన అత్యధిక స్కోరుగా ఉంది. ప్రస్తుత 2026 సీజన్ లీడర్బోర్డ్లో సంజూ శామ్సన్ (115), క్వింటన్ డికాక్ (112), తిలక్ వర్మ (101)లను వెనక్కి నెట్టి అభిషేక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో అభిమానులను అలరించిన అభిషేక్, రాబోయే మ్యాచ్ల్లో ఇదే జోరును ఎలా కొనసాగిస్తారో వేచి చూడాలి.

