కలం, వెబ్ డెస్క్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అర్హులైన 102 మంది జీవిత ఖైదీలను విడుదల (Life Convicts Release) చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మానవ హక్కుల వేదిక (Telangana HRF) నాయకులు కోరారు. ఈ మేరకు ఖైదీల విడుదలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విడుదలకు అర్హులైన 102 మంది జీవిత ఖైదీల ( వారిలో 6 మంది మహిళల) జాబితా ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉందని తెలిసిందని లేఖలో హెచ్ఆర్ఎఫ్ నాయకులు జీవన్ కుమార్ , తిరుపతయ్య, సంజీవ్ అన్నారు.
వారి విడుదల కోసం అర్హులైన ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 102 మంది జీవిత ఖైదీలను అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయాలని.. అలా చేస్తే భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయం, సమానత్వం, మానవ గౌరవం అనే ఆదర్శాలకు యథార్థ నివాళిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. తదుపరి జాబితాలోని ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా జీవిత ఖైదీల విషయంలో న్యాయం, సంస్కరణ, మానవత్వం అనే విలువలను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు : జీవన్ రెడ్డి
Follow Us On: Instagram

