కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్తో పాటు సంబంధిత ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్లపై తమ స్పందనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సదరు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వాదిస్తుండగా, స్పీకర్ నిర్ణయంపై న్యాయపరమైన సమీక్షకు కోర్టు మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి విచారణను కోర్ట్ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

