కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని (Telangana Heat Wave) చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ వేడి పెరుగుతోంది. మధ్యాహ్నం అయితే.. భానుడు నిప్పుల కొలిమిలా మారాడు. ఈ తరుణంలో రాష్ట్రంలో మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం, శనివారం పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే జగిత్యాల, సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది.
వడగాల్పులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలెవ్వరూ బయటికి రావొద్దని.. ఎండలో ప్రయాణాలు చేయకుండా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ప్రయాణాలు చేయాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. భానుడి ప్రతాపానికి శరీరం డీహైడ్రేడ్ అయి ఎండదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ప్రజలు మంచినీళ్లను ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. శరీరానికి చలువ చేసే నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ వంటివి తీసుకోవాలని అంటున్నారు.

