కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది అక్రమార్కులు వ్యవసాయ భూముల్లో ఇతర పంటల మాటున రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు ఇచ్చే రైతు భరోసా (Rythu Bharosa) పెట్టుబడి సాయాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గత ఆరు నెలలుగా పోలీసుల దాడుల్లో సుమారు 3,500 గంజాయి మొక్కలు పట్టుబడ్డాయి. ఈ అక్రమ సాగుకు పాల్పడుతున్న 57 మందికి నగదు చెల్లింపులను నిలిపివేయాలని ప్రభుత్వం ‘స్టాప్ పేమెంట్’ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా కందులు, జొన్నలు, పత్తి వంటి ఎత్తైన పంటల మధ్యలో గంజాయిని సాగు చేస్తూ కొందరు అధికారుల కళ్లు గప్పుతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న మరో 90 మంది వివరాలను కూడా పోలీసులు సేకరించారు. వారి రైతు భరోసా ప్రయోజనాలను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలను కూడా రద్దు చేయడం ద్వారా గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని యంత్రాంగం భావిస్తోంది.

