కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో గ్యాస్ కోసం గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ డీలర్ల వ్యవహారంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ ప్రకారం చూస్తే, ప్రతి గృహ వినియోగదారుడు నెలకు ఒక సిలిండర్ వినియోగించి, తదుపరి సిలిండర్ కోసం బుక్ చేసిన వెంటనే ఓటీపీ రావాల్సి ఉంటుంది. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు.
జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో గృహ వినియోగదారులు 40 రోజుల నుంచి 6 నెలల గ్యాప్తో గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఓటీపీ రావడం లేదని (OTP Issue) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ గోడౌన్ల వద్ద రోజూ ఓటీపీ కోసం ఎదురు చూడడం వారి దినచర్యగా మారింది. ఒకవైపు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతుండగా, మరోవైపు వినియోగదారులకు ఓటీపీ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీలర్లు కావాలనే ఆలస్యం చేస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు మాత్రం బ్లాక్ మార్కెట్లో సులభంగా సిలిండర్లు లభించడం గమనార్హం.
కమర్షియల్ సిలిండర్ల కొరతతో కొంతమంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారని, దీంతో అసలైన గృహ వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు మళ్లుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల మాయాజాలం కారణంగా గృహ వినియోగదారులు గ్యాస్ కోసం అష్టకష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

