కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక నిరీక్షణకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటన చేశారు. ఆర్థిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా 700 కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల అవసరాలను గుర్తించి ఆ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వెయ్యి కోట్లకు పెంచింది. దీనిలో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నిధులు తక్షణమే అందుబాటులోకి వచ్చాయి.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ నిర్ణయం గరిష్ట ప్రయోజనం చేకూర్చనుంది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. కేవలం నిధుల విడుదలే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. మెడికల్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
విద్యార్థుల స్కాలర్షిప్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాల ప్రక్రియను సైతం యంత్రాంగం వేగవంతం చేస్తోంది. ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములుగా భావిస్తూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

