కలం, నిర్మల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని సదర్మట్ బ్యారేజీ (Sadarmat Barrage) కి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గురువారం సాయంత్రం నాటికి బ్యారేజీలోకి 20,838 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అదే మొత్తంలో 20,838 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ గోదావరికి విడుదల చేశారు.
ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 274.400 మీటర్లు కాగా, 1.08 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఉధృతి పెరగడంతో మొత్తం 55 గేట్లలో ఐదు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

