కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం GHMC పరిధిని పునర్వ్యవస్థీకరించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) లుగా విభజించారు. ఈ విభజన ప్రక్రియలో భాగంగా నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్లకు కమిషనర్లు..
ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ యధావిధిగా కొనసాగుతారు. ఐటీ, పశ్చిమ నగర ప్రాంతాలతో కూడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సృజనను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పాలనా సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది. కమిషనర్ల నియామకంతో పాటు మొత్తం మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అత్యున్నత స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ను ఈ మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


