కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (Ande Sri) స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఘట్కేసర్ మండలంలోని ఓఆర్ఆర్ పరిధిలో ఒక ఎకరం 20 గుంటల స్థలాన్ని ఇందుకోసం కేటాయించబోతున్నారు. రూ.4 కోట్లతో స్మృతివనం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
స్మృతివనం పనులకు సంబంధించి ఆర్ అండ్ బీ శాఖ అంచనాలు సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. పనులను వేగంగా చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణం పూర్తయ్యాక స్మృతివనాన్ని హెచ్ఎండీఏకు (HMDA) అప్పగించబోతున్నారు. అందెశ్రీ (Ande Sri) సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు చాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ గేయకవి అందెశ్రీ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్మృతి వనం నిర్మాణానికి అనువైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
Read Also: సరికొత్త చరిత్ర సృష్టించిన మోదీ: నెహ్రూ రికార్డు బ్రేక్!
Follow Us On: Instagram

