కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ (NEET 2026) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎలాంటి రవాణా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు, ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు తమ హాల్టికెట్ను చూపిస్తే చాలు, ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించవచ్చు.
ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం అత్యంత ముఖ్యం కాబట్టి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం NEET పరీక్షకు వేల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఈ ఉచిత రవాణా సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో పరీక్ష రోజు టెన్షన్ తగ్గి, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయగలరని అభిప్రాయపడుతున్నారు.

