కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు భారతీయ కుటుంబాల్లో ప్రయాణాలు (Travel) కేవలం వేసవి సెలవులకో, ఏడాదికి ఒక్కసారి బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకునేలా ఉంటుంది. కానీ నేటి తరం ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆఫీసులో అలసటగా అనిపించినా, ప్రమోషన్ వచ్చినా, సోషల్ మీడియాలో ఏదైనా కొత్త వంటకం వీడియో చూసినా.. వెంటనే బ్యాగులు సర్దేస్తున్నారు. ఇటీవల ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎయిర్బీఎన్బీ, యూగవ్ సంయుక్తంగా 2,000 మందికిపైగా జెన్-జీ (Gen Z) యువతపై జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ తరం ఏడాదికి ఒకే పెద్ద ట్రిప్ వేయడం కంటే.. 24 నుంచి 72 గంటల పాటు సాగే చిన్న చిన్న పర్యాటక ప్రాంతాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుత యువతకు ఎక్కడికి వెళ్తున్నామనే ప్రదేశం కంటే, ఎందుకు వెళ్తున్నామని ఆలోచిస్తున్నారు. కేవలం మానసిక ఒత్తిడి, బర్నౌట్ నుంచి ఉపశమనం పొందడానికే దాదాపు 43 శాతం మంది ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో కాసేపు ప్రశాంతంగా గడపడం, కొత్త ప్రాంతాల ఆహార సంస్కృతిని రుచి చూడటం లాంటి ఫీలింగ్ ఆధారంగానే వీరి ప్రయాణాలు సాగుతున్నాయి. గత తరాల మాదిరిగా ఉదయం నుంచి రాత్రి దాకా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల ‘లిస్ట్’ వీరికి ఉండదు. వైరల్ అవుతున్న క్రౌడెడ్ టూరిస్ట్ స్పాట్స్కు దూరంగా ఉంటూ, తమ ట్రిప్స్ చాలా పర్సనల్గా, ఎలాంటి ముందస్తు ప్లానింగ్స్ లేకుండా సాగాలని 95 శాతం మంది కోరుకుంటున్నారు.
ఆశ్చర్యకరంగా.. మూడింట రెండు వంతుల మంది జెన్-జీ (Gen Z) పర్యాటకులు తాము ఏ పనీ చేయకుండా కేవలం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికే ప్రయాణాలు చేస్తున్నట్లు సర్వేలో చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరికీ తెలియని సీక్రెట్ ప్లేస్ అని వచ్చే వైరల్ వీడియోలను గుడ్డిగా నమ్మడం లేదు. స్థానిక సంస్కృతిని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని నేరుగా తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
Read Also: గుండె ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ మంచిదేనా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!
Follow Us On: X(Twitter)

