కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో “ఒకే కార్డు–అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి” అనే విధానంతో యూనిఫైడ్ వెల్ఫేర్ స్మార్ట్ కార్డు (Unified Welfare Card) కార్యాచరణను రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే ఈ కార్డు ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్డు ద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం అందిస్తున్న రేషన్, పెన్షన్, మహాలక్ష్మి, తదితర అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆ కార్డుకు అనుసంధానించి ప్రజలకు అందించే సేవలను సులభతరం చేయాలని సీఎస్ సూచించారు. ముఖ్యంగా ప్రజల డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనిపై తగు ప్రణాళికను రాబోయే 10 రోజుల్లోగా సిద్ధం చేయాలని చెప్పారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పెన్షన్ డేటా, ఆరోగ్య ప్రొఫైల్ వంటి సమాచారం కూడా ఈ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, అధికారులు పాల్గొన్నారు.

