కలం, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్పై క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి విరుచుకుపడ్డాడు. జట్టు బ్యాటర్లు అంతా వరుసబెట్టి ఔట్ అవుతున్నా.. ఆ ఒత్తిడిలో కూడా బుడ్డోడు భలే ఆటతీరు కనబరిచాడు. ఆఖరి వరకు నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. హిట్టింగ్ చేస్తారనుకున్న జైశ్వాల్, జురెల్ ఇద్దరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమే కావడంతో వైభవ్పై ఒత్తిడి పెరిగింది. ఆఖరికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా నిరాశపరిచినా.. జడేజాతో కలిసి వైభవ్ వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా, మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మాత్రం చేతులెత్తేశాడు. యశస్వి జైస్వాల్ (1), ధ్రువ్ జురెల్ (7) ఇద్దరూ సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో రాజస్థాన్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో వైభవ్ సూర్యవంశీ బౌండరీల వేట మొదలుపెట్టాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి 204.25 స్ట్రైక్ రేట్తో 96 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో రబాడ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుతిరిగాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 45 పరుగులు చేసి అండగా నిలిచాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (11), దసున్ శనక (3), జోఫ్రా ఆర్చర్ (7) నిరాశపరిచినా, చివర్లో డోనోవన్ ఫెరీరా ఊహించని మెరుపులు మెరిపించాడు. ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 38 పరుగులు చేయడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
గుజరాత్ బౌలర్లలో కాగిసో రబాడ 35 పరుగులిచ్చి 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రషీద్ ఖాన్ వేసిన 2 ఓవర్లలోనే రాజస్థాన్ బ్యాటర్లు 45 పరుగులు పిండుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే ఇప్పుడు 20 ఓవర్లలో 215 పరుగులు చేయాల్సి ఉంది.

