కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వేదికగా కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా చేసే ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టడమే లక్ష్యంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ విద్వేష నివారణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈ కొత్త చట్టం ప్రకారం నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. నేరానికి పాల్పడిన వారికి ఒక ఏడాది నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించేలా ప్రతిపాదించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా, సమాజంలో శాంతిభద్రతలను కాపాడేలా ఈ బిల్లును రూపొందించారు.
దేశంలో ఇలాంటి విద్వేష నివారణ బిల్లును ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం మొదటిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకురాగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను అరికట్టేందుకు సిద్ధమైంది.

