కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టం-2026ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమలు చేయబోతోంది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ జీవో ఎంఎస్ నంబర్ 10ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, పన్నుల విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఈ నిబంధన ప్రకారం వాహన రకాన్ని బట్టి వినియోగదారులు 2వేల రూపాయల నుండి గరిష్టంగా 10 వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం (Telangana Government) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో రిక్షాలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ఈ భారం పడనుంది. రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త పన్ను విధింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 270 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

