కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఏమాత్రం లేదని.. వదంతులని నమ్మి, పెట్రోల్, డీజిల్ ముందస్తు కొనుగోలు చేయవద్దని పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని పేర్కొంది. అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు తెలంగాణాలో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఇంధన సరఫరా సక్రమంగా జరిగేలా సమన్వయం చేస్తున్నారని వివరించింది.
అక్రమంగా నిల్వ చేసుకోవద్దు..
సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 7,443 కిలో లీటర్లు పెట్రోల్, 11,081 కిలో లీటర్లు డీజిల్ సరఫరా అయిందని పౌరసరఫరాల శాఖ వివరించింది. ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం మానుకోవాలని.. అక్రమంగా ఇంధన నిల్వ చేయడం నిషేధమని.. అలా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాంటి ఘటనలు ప్రజల దృష్టికి వస్తే పౌరసరఫరాల శాఖ హెల్ప్లైన్ నెంబర్ 1967ను సంప్రదించాలని కోరింది.

