కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇంధన కొరత దృష్ట్యా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి వైసీపీ ఎంపీ గురుమూర్తి (MP Gurumurthy) లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 4510 పెట్రోల్ బంకుల్లో 70% నో స్టాక్ బోర్డులు వెలిశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అటు పెట్రోలియం శాఖ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లైకి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుందని.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుందని ప్రస్తావించారు. క్షేత్రస్థాయికి, ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలని కోరారు. రాష్ట్ర అవసరాలకు తగిన పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలని లేఖలో రాసుకొచ్చారు.

