కలం, వెబ్డెస్క్: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విశ్వరూపం ప్రదర్శించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆర్సీబీ.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు చుట్టేశారు. కేవలం 75 పరుగులకే ఢిల్లీ కథ ముగియగా, ఆ స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించి పాయింట్ల పట్టికలో తమ సత్తా చాటింది.
ఢిల్లీ ఇన్నింగ్స్ను జోష్ హాజల్వుడ్ (4 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (3 వికెట్లు) ఆరంభం నుంచే దెబ్బతీశారు. పవర్ ప్లేలో 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకుంది. అభిషేక్ పోరెల్ చేసిన 30 పరుగులే ఆ జట్టులో అత్యధికం. మిగిలిన వారంతా వరుసగా క్యూ కట్టడంతో 16.3 ఓవర్లలోనే 75 పరుగుల వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్కు తెరపడింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ జాకబ్ బెథెల్ (20) మూడు బౌండరీలతో మెరుపులు మెరిపించినా, జెమిసన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (23 నాటౌట్) తనదైన శైలిలో రెండు సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు.
ఢిల్లీ బౌలర్లు కనీస ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా కైల్ జెమిసన్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకోగా, నటరాజన్ వేసిన 3 బంతుల్లోనే 12 పరుగులు వచ్చాయి. కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు, రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుంది. బౌలింగ్లో హాజల్వుడ్, భువీ కనబర్చిన క్రమశిక్షణే ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించగా, బ్యాటర్లు దాన్ని లాంఛనంగా పూర్తి చేశారు.

