కలం, వెబ్ డెస్క్ : ఎల్నినో ప్రభావాన్ని అధిగమించడంపై హైదరాబాద్లోని రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో ఒకరోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ (El Nino Workshop) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నీటి సంరక్షణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్థక శాఖల సమన్వయంతో రైతులకు నీటి భద్రత కల్పించడమే ప్రాథమిక లక్ష్యంగా సమావేశం సాగింది. ఇందులో భాగంగా సమగ్ర వ్యవసాయ చెరువుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీబీ-జీ రామ్జీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనుల విధానం, సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సర్పంచ్లు, స్థానిక సంస్థల అధికారులతో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ నిర్వహించి, జీపీఎస్ఏపీ సాఫ్ట్వేర్ పనితీరుతో పాటు వివిధ శాఖల మార్గదర్శకాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామీణ ఉపాధిని మెరుగుపరుస్తూనే చేయూత పింఛన్లు, పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ ధన కిషోర్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, సురేంద్రమోహన్, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ ఇలాంబర్తి, లక్ష్మి, నిఖిలతో పాటు పలువురు అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

