కలం, వెబ్ డెస్క్ : కాంబోడియా వేదికగా భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ సైబర్ క్రైమ్ (Cyber Crime)నెట్వర్క్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజయవంతంగా ఛేదించింది. దుబాయ్ నుండి కాంబోడియా వరకు విస్తరించిన ఈ భారీ సిండికేట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రధానంగా అమాయక ప్రజల ఆధార్ కార్డులు, ఇతర వ్యక్తిగత పత్రాలను సేకరించి, వారి పేరుతో పెద్ద ఎత్తున సిమ్ కార్డులను తీసుకుంటోంది. ఇలా పొందిన సిమ్ కార్డులను విదేశాలకు తరలించి, అక్కడ ఉన్న సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ నెట్వర్క్ ద్వారా విదేశాల నుండి భారతీయులపై కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు అత్యంత పకడ్బందీగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ, ఇక్కడి సిమ్ కార్డులను (SIM Cards) ఉపయోగించి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం లేదా పెట్టుబడుల పేరుతో దోచుకోవడం వంటివి చేస్తున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు, ఈ సిమ్ కార్డ్ సప్లై చైన్ను విచ్ఛిన్నం చేసి నిందితుల వద్ద నుండి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ గడ్డపై నుండి జరుగుతున్న ఈ సైబర్ దాడుల (Cyber Crime) వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం పోలీసులు గాలింపును మరింత ఉధృతం చేశారు.
Read Also: ఫేస్బుక్ ప్రేమ పెళ్లి విషాదాంతం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Follow Us On: X(Twitter)

