కలం, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు (Musi Rejuvenation Project) బీఆర్ఎస్ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని స్పష్టం చేశారు. ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఆగదన్నారు. ఇది తన కోసం తన కుటుంబం కోసం కాదని తెలంగాణ ప్రజల కోసమని స్పష్టం చేశారు. కొందరికి కుటుంబమంటే నలుగురు వ్యక్తులు కావచ్చు. కానీ, తనకు కుటుంబమంటే నాలుగు కోట్ల మంది ప్రజలు అని పేర్కొన్నారు. ’మాకు ఇరుకు ఆలోచనలు లేవు, సంకుచిత స్వార్థం లేదు. హైడ్రా (Hydraa) ప్రారంభించిన నాడు నాకు శాపనార్ధాలు పెట్టారు. ఈ రోజు చెరువుల పునరుద్ధరణతో ఫలితాలు కనిపిస్తుంటే ప్రజలే ఆశీర్వదిస్తున్నారు. మూసీ విషయంలో కూడా జరగబోయేది ఇదే.’ అంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు.
‘నేను రాజకీయాలు మాట్లాడటం, విమర్శలు చేయడం వద్దని అనుకున్నాను. కానీ, కొందరు నాయకులు, కొన్ని పార్టీల వికృత ఆలోచనలు ప్రజలకు వివరించకపోతే సమాజానికి నష్టం చేసిన వాడిని అవుతానన్న బాధతో, భావనతో కొన్ని విషయాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. తమ ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు కొందరు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరంభించక ముందే… ఆలోచన స్థాయిలోనే దోపిడీ, అవినీతి, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నామంటూ ఆరోపణలు చేయడం ఏంటి? కొందరు నాయకులు ప్రజల మనసులను కలుషితం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు మూసీ ప్రక్షాళన (Musi Rejuvenation Project) అవసరమే అంటూనే నోటితో చెబుతూ, నొసటితో వెక్కిరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మూసీ నిర్వాసితుల కష్టం, కన్నీళ్ల గురించి ఈ రాష్ట్రంలో తనకంటే బాగా బాగా ఎవరికీ తెలియదన్నారు. తాను మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం పోరాడిన నేతని దీక్షలు చేసిన వాడిననని గుర్తు చేశారు. ఆ రోజు ప్రభుత్వం ఆరో ప్రభుత్వంలా లేదంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ‘తాను గతంలో దుర్భేద్యమైన పరిస్థితులను, కట్టుదిట్టమైన పోలీసు వలయాలను ఛేదించుకుని వెళ్లి బాధితుల పక్షాన నిలబడ్డానని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో రాక్షసత్వంతో వ్యవహరించిన వాళ్లే నేడు మూసీ నిర్వాసితుల పక్షాన వేషం మార్చుకుని వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వీళ్లు న్యాయం చేసే వాళ్ల లెక్క వకాల్తా పుచ్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల మాటల్లో నిజాయితీ లేదన్నారు. వాళ్లలో స్వార్థం, దుర్భుద్ధి ఉందని మండిపడ్డారు.
Read Also: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ
Follow Us On : WhatsApp

