కలం, మెదక్ బ్యూరో : తెలంగాణలో అత్యంత పారదర్శకంగా జనగణన జరగడమే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి (Census Director Bharati Holikeri) తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణన డైరెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని తెలిపారు. పక్కా సమాచారంతో పకడ్బందీగా జన గణన చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జనాభా లెక్కల ప్రక్రియపై చురుకుగా పర్యవేక్షణ చేస్తున్నామని భారతి హోళికేరి వెల్లడించారు.

