కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet) సంచలన నిర్ణయాలు తీసుకున్నది. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026)ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లుతోపాటు పలు కీలకమైన బిల్లులకు క్యాబినెట్ ఆమోదం లభించింది.
గిగ్వర్కర్ల కోసం ప్రత్యేక వసతులు
గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన “తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ 2026 బిల్లును కూడా క్యాబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తోపాటు వెల్ఫేర్బోర్డ్ ఏర్పాటు, సంక్షేమనిధి ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లు ప్రకారం గిగ్వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతోపాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయనున్నారు. దీంతో గిగ్ వర్కర్లకు ప్రత్యేకమైన రక్షణ లభించనున్నది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్పమార్పులతో క్యాబినెట్ (Telangana Cabinet) ఆమోదించింది.
ఎల్ అండ్ టీ స్వాధీనం
హైదరాబాద్లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రుణబారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కులగణన అధ్యయనం
రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదికను తయారు చేసింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను క్యాబినెట్ చర్చించింది. సామాజికన్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ 6 నుంచి నుంచి డిసెంబర్ 25వ వరకు 50 రోజులపాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను క్యాబినెట్ సబ్కమిటీకి అప్పగించింది.
రోహిత్ వేముల చట్టానికి విధి విధానాలు
విద్యాసంస్థల్లో కులవివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.. మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు.

