కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని 30వ డివిజన్కు చెందిన మహిళా కాంగ్రెస్ కార్యకర్త చట్టు మంగ తనపై జరుగుతున్న వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పంపింగ్ వెల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 21న జరిగిన బూత్ లెవల్ కమిటీ సమావేశంలో పార్టీకి చెందిన బొమ్మ ఉదయ్ అనే వ్యక్తి తనను ఉద్దేశిస్తూ అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపించారు. “నీకు రాజకీయాలతో పనేమిటి? ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలి” అంటూ అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇలాగే కించపరిచారని, పెద్దల దృష్టికి తీసుకెళ్లినా అతనిలో మార్పు రాలేదని చెప్పారు.
తాను నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి రాలేదు అన్నారు. 1997 నుంచే గాంధీనగర్ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని, పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని తెలిపారు. తన పనితీరు గురించి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) లకు బాగా తెలుసని అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో, క్షేత్రస్థాయిలో ఇలాంటి అవమానకర ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళా కార్యకర్తలకు గౌరవం కల్పించాలని, తనను దూషించిన వ్యక్తిపై పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని చట్టు మంగ డిమాండ్ చేశారు.

