కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సకాలంలో 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నాగధర్ గ్రామానికి చెందిన సింధు అనే 15 ఏళ్ల బాలిక సోమవారం అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ సిబ్బంది “వస్తున్నాం… వస్తున్నాం…”అని చెబుతూ సమయానికి చేరుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సింధుకు సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే తమ కుమార్తె బతికి ఉండేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 108 సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

