కలం, వెబ్ డెస్క్ : ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టుకు భారత జట్టును బీసీసీఐ (Team India Squad )ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేయింగ్ ఎలెవన్పైనే పడింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్లో ఈ మ్యాచ్ జరగనుంది. జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సిరీస్కు విశ్రాంతి ఇచ్చారు. జడేజా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. బుమ్రా పని భారం కూడా ఇటీవల చర్చకు రావడంతో అతనికి విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ టెస్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ ఉప కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జోడీ ఇప్పటికే స్వదేశంలోనూ, విదేశాల్లోనూ మంచి భాగస్వామ్యాలు నమోదు చేసింది. మూడో స్థానంలో సాయి సుదర్శన్కు మరో అవకాశం దక్కే అవకాశం ఉంది. టెస్టుల్లో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రాణించకపోయినా, అతనిపై జట్టు నమ్మకం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్, తర్వాత దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
వికెట్ కీపర్గా రిషభ్ పంత్ జట్టులో కీలకంగా మారనున్నాడు. ధృవ్ జురెల్ కూడా జట్టులో ఉన్నప్పటికీ, ఇటీవల అతని ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పడిక్కల్కు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా జట్టులో స్థానం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్పై కొన్ని సందేహాలు ఉన్నా, బ్యాటింగ్లో అతని స్థిరత్వం జట్టుకు ఉపయోగపడనుంది. బౌలింగ్ విభాగంలో హర్ష్ దూబేకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి.
ఎడమచేతి స్పిన్నర్గా అతను కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి స్పిన్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గర్నూర్ బ్రార్ జట్టులోకి వచ్చినా, తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ముల్లాన్పూర్ మైదానం సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నా, రెడ్ బాల్ ఫార్మాట్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మ్యాచ్ రోజునే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

