కలం, కరీంనగర్ బ్యూరో: జన గణనలో కుల గణన లెక్కింపునకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన నిర్వహించి ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయంతో ముందుకు పోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాదిరి దేశ వ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. జన గణనలో కుల గణన చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి తరువాత కాలమ్ 13లో బీసీల అంశం చేర్చలేదని విమర్శించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కాలమ్ 13లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ గణన లెక్కించాలని కోరామని గుర్తు చేశారు.
కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్నిచ్చేదిగా ఉందన్నారు. జన గణనలో కుల గణన లెక్కిస్తే సామాజిక న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుల గణన ద్వారా కచ్చితమైన లెక్కలున్నప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కుల గణన నిర్వహించి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టం చేశామని ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.

