కలం, వెబ్ డెస్క్: విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా (YSR Kadapa District) పోరుమామిళ్ల మండలంలో చోటు చేసుకున్నది. ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి మద్యం మత్తులో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులకు సమాచారం అందడంతో వారు ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం ఆగ్రహావేశంతో అతడికి దేహశుద్ధి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వహించాల్సిన వ్యక్తులే ఇటువంటి దారుణాలకు పాల్పడటం సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


