కలం, వెబ్ డెస్క్: ఏపీలో రాజ్యసభ (Rajya Sabha) సీట్ల కేటాయింపుపై పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు రాజ్యసభ సభ్యులుగా టీడీపీలోని ముగ్గురు నాయకుల పేర్లను ఖరారు చేశారు. ఈ జాబితాలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఉన్నారు. అయితే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన పలువురు నాయకులు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక కడప టీడీపీ నాయకుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy Reddeppagari) బహిరంగంగానే ఆయన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
గత పదమూడేళ్లుగా కడపలో క్లిష్టమైన రాజకీయ పరిస్థితులున్నా, జిల్లాలో పార్టీకి అండగా ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశానని శ్రీనివాస రెడ్డి అన్నారు. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేసినట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా తనను ఎంతో కలతకు గురి చేసిందని చెప్పారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం తన రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుందని శ్రీనివాసరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. అయితే పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించడం, వ్యతిరేకించడం వంటివి ఉండబోవని, కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటానని శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy Reddeppagari) స్పష్టం చేశారు.
Read Also: పవన్ సినిమాల్లో కంటే బయట సింగిల్ టేక్ ఆర్టిస్ట్: కేతి రెడ్డి
Follow Us On : WhatsApp

