కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడుతూ.. పవన్ తన కుటుంబసభ్యులకు ఏమైనా అయితే వస్తాడో రాడో కానీ, చంద్రబాబుకు ఏదైనా జరిగితే వెంటనే అందరి కంటే ముందు వస్తాడన్నారు. పవన్ సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదని, బయటకు వస్తే మాత్రం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అన్నారు. పవన్ ఏపీలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేతిరెడ్డి గుర్తు చేశారు. 30 వేల మంది తప్పిపోయిన వారి విషయంలో గూఢచారిగా వచ్చాడని, ఆధ్యాత్మిక సినిమా తీయాలంటే సనాతనిగా వస్తాడని, కుటుంబంలో గొడవలు జరిగితే గన్ తీసుకొని వస్తాడని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ వివిధ పాత్రలు, వివిధ రూపాల్లో వస్తుంటాడని విమర్శించారు.
ఇటీవల తమిళనాడులో విజయ్ గెలిచినప్పటి నుంచి పవన్ తెగ ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎవరైనా నువ్వు సీఎం ఎప్పుడు అవుతావని ప్రశ్నిస్తే పవన్ స్పందించే తీరు విచిత్రంగా ఉందన్నారు. మన పార్టీకి అంత క్యాడర్ ఉందా?. ఆలోచన ఉందా?, బలం ఉందా? అడ్మినిస్ట్రేషన్ తెలుసా?.. అంటూ పవన్ అంటున్నారన్నారు. మరి పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్ కూడా పవన్ తో పాటే పార్టీ పెట్టారు కదా అని వ్యాఖ్యానించారు. ఇక పవన్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టారా? అని నిలదీశారు. పవన్కు వైఎస్ఆర్, జగన్పై నిలువెత్తు ద్వేషం ఉందన్నారు. తెలంగాణలో పవన్ వైఎస్ఆర్ గురించి నోటికొచ్చినట్లు వాగుతున్నాడని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్నే ఎదురించానని, గన్ కూడా ఇచ్చేశానని అంటున్నారని తెలిపారు. గన్ ఇచ్చింది తన అన్న కూతురు ఫిర్యాదు చేసినందుకేనని స్పష్టం చేశారు.

