కలం, వెబ్డెస్క్: తెలుగుదేశం పార్టీ మహానాడు (TDP Mahanadu) నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించి మొత్తం 20 కమిటీలను పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. కార్యక్రమాల సమన్వయం, సభా నిర్వహణ, వసతి, తీర్మానాల రూపకల్పన వంటి విభాగాల కోసం ప్రత్యేక కమిటీలను నియమించింది.
మహానాడు సమన్వయ కమిటీకి నారా లోకేశ్ నేతృత్వం వహించనుండగా, ఇందులో 10 మందిని సభ్యులుగా నియమించారు. ఆహ్వాన కమిటీ బాధ్యతలను పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. తీర్మానాల కమిటీకి యనమల రామకృష్ణుడు నేతృత్వం వహించనున్నారు.
సభా నిర్వహణ కమిటీకి పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా బాధ్యతలు చేపట్టనున్నారు. వసతి కమిటీకి అచ్చెన్నాయుడు నాయకత్వం వహించనున్నారు. మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు, శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది.

